ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పెద్ద టాపిక్...
రాజకీయాల పై నాకున్న సహజమైన ఆసక్తి రీత్యా నేను కాలేజీ రోజుల్లో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండే వాణ్ణి.
చిన్నతనం నుంచి ఈనాడు పేపర్ ని డైలీ ఫాలో అవ్వడం, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను (వారి గురించి తర్వాత ప్రత్యేకంగా చెప్తాను) చాలా దగ్గరనుంచి చూడటం, ఉమ్మడి కుటుంబ నేపద్యంలో పెదనాన్న, నాన్న, పెద్దమ్మ గ్రామ స్థాయి పదవులు చేయడం మొదలగు కారణాల వాళ్ళ, నాలో చిన్నతనం నుంచి రాజకీయాల మీద ఆసక్తి కలిగింది.
చదువులు పూర్తి చేస్కొని కాస్త లైఫ్ లో సెటిల్ అయ్యే క్రమంలో రాజకీయాల మీద శ్రద్ద కొంచెం తగ్గింది. వైయస్ మరణం తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ మద్య కాలంలో రాజకీయాల గురించి ఆలోచన పెరిగింది. నా ఆలోచనల తో ఒక బ్లాగ్ రాయాలి అని నిర్ణయించుకొని, ఎట్టకేలకు ఈరోజు ఈ టాపిక్ తో ప్రారంభిస్తున్నాను.
మన రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో మహానుబావులు... అందరికి వందనాలు!!!
చాలా మంది గొప్ప గొప్ప నాయకులు మన రాష్ట్రము నుంచి ఉన్నారు.
PV నరసింహారావు గారు NTR గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైయస్ గారు.
PV నరసింహారావు గారు బహుబాషా కోవిదులు. CM గా మరియు PM గా చేసి మన తెలుగు వారి గొప్ప తనాన్ని చాటి చెప్పారు.
NTR తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో, పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో అధికార పీఠాన్ని అలంకరించడం మహాద్బుతం.
చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్నిఅత్యదిక రోజులు పరి పాలించిన ఏకైక వ్యక్తి. IT లో రాష్ట్రాన్ని ఒక ప్రముఖ స్థానం లో నిలబెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో నాయుడు గారి పాత్ర చాలా ముఖ్యమయినది.
రాష్ట్రము లో కాంగ్రెస్ కి జెండా కట్టే నాధుడే కరువయ్యడా అనే పరిస్థితుల్లో, వైయస్ పాద యాత్ర చేపట్టడం, అద్బుతమయిన మెజారిటీ తో అధికారం లో రావడం, రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక మలుపు. పచ్చిగా చెప్పాలి, అంటే ప్రతి పక్షం లో ఉండి, విసిగి వేసారి, TDP లోకి పోలేక, కాంగ్రెస్ లో ఉండలేక, కాంగ్రెస్ అధికారం లోకి రావడం కేవలం కల మాత్రమే అనుకుంటూ... కాడర్ ని పోషించే క్రమంలో ఆస్తులు కూడా కరిగిపోతున్నాయి అని అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు నిజం గా YS గొప్ప వరం. YS చేసిన పనులు అన్నిటినీ మనం ప్రత్యక్షం గానే చూసాం. అయన చేసిన పనుల్లో అవినీతి ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. ఆరోగ్య శ్రీ అనేది చాలా గొప్ప కార్యక్రమం. కనీసం అటువంటి ఆలోచన చేసే దైర్యం కూడా ఇంత వరకు ఎవరు చేయలేదు. ఆరోగ్య శ్రీ అనే సంకల్పం చేసినందుకు, YS ను అభినందించాల్సిందే. అయితే, ఆచరణలో లోపాలకు, YS ఒక్కన్నే బాధ్యున్ని చేయడం తగదు అని నా అభిప్రాయం. మన సిస్టం అలా ఉంది. అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ ని దుర్వినియోగం చేయడంలో వారి వంతు పాత్ర వాళ్ళు పోషించారు.
రాగా పోగా ఏంటి అంటే, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెత లాగా మనం చేయం, చేసే వాళ్ళను చేయనివ్వం అనే విధంగా మన రాజకీయ పార్టీలు ఉండటం చాలా బాధాకరం. YS చనిపోయిన తర్వాత కూడా అయన గురించి దుష్ప్రచారం అనేది ఒక సగటు మనిషిగా నన్ను చాలా బాధించే విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ టి ఆర్ అండ్ వైయస్ లను ఇంకా వంద సంవత్సరాలు అయినా ప్రజలు మర్చిపోలేరు అనేది అతిశయోక్తి కాదు.
ఈ నలుగురు నాయకుల్లో ఎవ్వరూ, రోజుకి పదిహేను గంటలకు తక్కువగా పని చేసి ఉండరు. ఎవ్వరూ మన లాగా వీకెండ్ అని లేట్ గా నిద్ర లేచి, మూవీ కి వెళ్లి, అలా అలా సరదాగా బతకలేదు. ఎన్నో ఒత్తిళ్లకు ఎదురు నిలబడి,ఎన్నో సవాళ్ళను అధిగమించి, ప్రజాహితం కోసం వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసారు. నాయకులు, ముందు వాళ్ళు చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ, వాళ్ళ మంచి ఆలోచనలను కోన సాగిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప, అయన ఇలా చేసారు, ఈయన అలా చేసారు అని సమయాన్ని వృధా చేయడం నిజంగా బాధాకరం.
బాగా అనుభవం వున్న రోశయ్య గారి పాలన గురించి చాలా హీనంగా మాట్లాడారు మన రాజకీయ నాయకులు. ఇప్పుడు యువకుడు, మంచి క్రీడా స్పూర్తి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, జూనియర్ అని, అనుభవం లేదు అని మాట్లాడుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని సవాళ్ళను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని కోరుకుంటున్నాను.
రాజకీయాలను అందరి లాగా విమర్శించడం కాకుండా, రాజకీయాల్లోని మంచి కోణాన్ని మరియు ఒక సగటు ఓటరుగా నా ఆలోచనలను ఆవిష్కరించే ప్రయత్నం ఈ బ్లాగ్ తో ప్రారంభిస్తున్నాను.
రాధాకృష్ణ